కర్నూలు, మహి న్యూస్, జనవరి 17:-జిల్లాలో రైతుల ఆదాయం పెంచడమే లక్ష్యంగా మండల స్థాయిలో కార్యాచరణ వ్యవసాయ ప్రణాళికలను సమర్థవంతంగా అమలు చేయాలని జిల్లా కలెక్టర్ డా.ఏ.సిరి సంబంధిత వ్యవసాయ అనుబంధ శాఖ అధికారులను ఆదేశించారు..
శనివారం కలెక్టరేట్ కార్యాలయంలో ఈ క్రాప్ బుకింగ్, రైతు సేవా కేంద్రాల యాక్షన్ ప్రణాళిక తదితర అంశాలపై వ్యవసాయ అనుబంధ శాఖ అధికారులతో, మండల వ్యవసాయ శాఖ అధికారులతో, రైతు సేవ కేంద్రం అధికారులతో కలెక్టర్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ గతంలో ఉల్లి, పత్తి పంటల సేకరణలో ఎదురైన సాంకేతిక మరియు ఇతర సమస్యలను దృష్టిలో ఉంచుకుని, రాబోయే కందులు, శనగలు, మిర్చి పంటల విషయంలో ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ వ్యవసాయ అధికారులను ఆదేశించారు… పంట సేకరణ ప్రక్రియలో రైతులు ఇబ్బంది పడకుండా, ఎటువంటి పొరపాట్లు జరగకుండా చూడడమే తన ప్రధాన లక్ష్యమని కలెక్టర్ స్పష్టం చేశారు.. రైతులు సాగు ప్రారంభం చేసినప్పటి నుండి పంట మార్కెటింగ్ వరకు ఎదుర్కొనే ప్రతి అంశాన్ని సమగ్రంగా అధ్యయనం చేసి సమస్యలకు ముందస్తు పరిష్కారాలతో కూడిన స్పష్టమైన యాక్షన్ ప్లాన్ రూపొందించాలన్నారు.. రైతు సేవా కేంద్రాల ద్వారా అమలు చేయాల్సిన ప్రణాళిక గురించి ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ ఆదేశించారు… రైతు సేవా కేంద్రాల స్థాయిలో ఉండే అగ్రికల్చర్, హార్టికల్చర్ అసిస్టెంట్ వారి పరిధిలో అమలు చేస్తున్న వ్యవసాయ అనుబంధ కార్యకలాపాలకు బాధ్యత వహించాలన్నారు…ఈ–క్రాప్ బుకింగ్ నమోదు ప్రక్రియను సకాలంలో పూర్తి చేయాలని కలెక్టర్ వ్యవసాయ అధికారులను ఆదేశించారు.
రైతు సేవా కేంద్రాల పరిధిలోని ఉన్నటువంటి భూమిలో ఈ ఏడాది ఏ పంట ఎంత నష్టపోయింది, వచ్చే ఏడాదికి ప్రణాళిక ఏమిటి, పంట మార్పిడి ఎంత చేస్తారు, ఉద్యానవన విస్తరణ ఎంత చేస్తారు, డ్రిప్ ఇరిగేషన్ ఎన్ని యూనిట్లు ఏర్పాటు చేస్తారు, ప్రకృతి వ్యవసాయం ఎంతవరకు విస్తరిస్తారనే ప్రణాళిక కావాలన్నారు.. ‘పోస్ట్ హార్వెస్ట్’ (పంట కోత అనంతర పద్ధతులు) మరియు మార్కెటింగ్ అనేది చాలా ముఖ్యమని సంబంధిత అంశం పై ఏం చేస్తే బాగుంటుందో అనే ప్రణాళిక కూడా ఉండాలన్నారు….
తుంగభద్ర LLC నుండి నీరు ఆగిపోయిందని, దీని గురించి మేము 2 నెలల ముందే చెప్పామని, సంబంధిత విషయం గురించి రైతులకు మీరు చెప్పకపోతే సంబంధిత అధికారులు బాధ్యత వహిస్తారన్నారు.. సుంకేసుల బ్యారేజ్ లేదా గాజులదిన్నె ప్రాజెక్ట్ సమీపంలో వరి (paddy) సాగును ప్రోత్సహించవద్దన్నారు.. వరికి నీరు చాలా ఎక్కువ అవసరమని, వరి పంట కాకుండా ఇతర పంటలను ప్రోత్సహించాలన్నారు…
గత ఏడాది ఉల్లి పంట విషయంలో చాలా సమస్యలు వచ్చాయన్నారు.. అందు వల్ల ఈ అంశంలో రైతులను చైతన్యవంతం చేయాలన్నారు. గరైతులకు సబ్సిడీపై డిబ్లర్లు, డ్రిప్, రైజ్డ్ బెడ్ మెషీన్లను 70 శాతం సబ్సిడీ తో అందించాలని ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపడం జరిగిందన్నారు.. ఈ సాగు విధానాన్ని ప్రభుత్వానికి ప్రతిపాదించామని, రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదనలు ఆమోదం చేయగానే అందుకు తగిన చర్యలు తీసుకుంటామన్నారు.
ఈ ఏడాది జాస్మిన్ (మల్లెపూలు) సాగు కనీసం 1000 ఎకరాలలో ప్రారంభించాలన్నారు.. ఉద్యానవన విస్తీర్ణంలో భాగంగా ఉల్లి సాగు విస్తీర్ణాన్ని తగ్గించి, ఆ స్థానంలో డ్రాగన్ ఫ్రూట్, స్వీట్ ఆరెంజ్ (నారింజ), బొప్పాయి, అరటి, మరియు జామ వంటి పండ్ల తోటలను 10 వేల ఎకరాలలో పెంచాలని కలెక్టర్ ఉద్యాన శాఖ అధికారిని ఆదేశించారు..అదే విధంగా అన్నిటికీ డ్రిప్ సౌకర్యం కల్పించేలా చర్యలు తీసుకోవాలన్నారు.. రైతులు పండించే పంటకు తగిన ధర లభించాలన్నదే తన ఏకైక లక్ష్యం అని కలెక్టర్ స్పష్టం చేశారు. రైతుల తలసరి ఆదాయం పెంచడానికి మల్లెపూలు (Jasmine), డ్రాగన్ ఫ్రూట్, బొప్పాయి మరియు అరటి వంటి పంటలను సాగు చేయాలని కలెక్టర్ వ్యవసాయ అనుబంధ అధికారులను ఆదేశించారు… ఆయా మండలాల్లో పండే పంటల ఆధారంగా కోల్డ్ స్టోరేజీలు, పాలీ హౌస్లు, ప్యాక్ హౌస్లు, సోలార్ కోల్డ్ రూమ్స్, మరియు డ్రైయర్ల ను ప్రోత్సహించాలని కలెక్టర్ వ్యవసాయ అనుబంధ అధికారులను ఆదేశించారు… యూరియా కి సంబంధించి ఎటువంటి సమస్యలు రాకుండా చూసుకోవాలన్నారు..
సమావేశంలో ఉద్యానవన శాఖ అధికారి రాజాకృష్ణ రెడ్డి, అసిస్టెంట్ డైరెక్టర్ ఆఫ్ అగ్రికల్చర్ అరుణ కుమారి, తదితరులు పాల్గొన్నారు

