*కడప, మహి న్యూస్ జనవరి 27 : రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న భూ రికార్డుల స్వచ్చీకరణ, రీ సర్వే పనులను.. జిల్లాలో ప్రణాళిక ప్రకారం చురుగ్గా చేపట్టాలని.. జిల్లా కలెక్టర్ డా. శ్రీధర్ చెరుకూరి రెవెన్యూ అధికారులను ఆదేశించారు.మంగళవారం రాష్ట్ర రాజధాని నుండి రాష్ట్ర రెవెన్యూ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి సాయిప్రసాద్, రాష్ట్ర భూ పరిపాలనా శాఖ (సీసీఎల్ఏ) ప్రత్యేక ముఖ్య కార్యదర్శి జయలక్ష్మితో కలిసి.. భూముల రీ సర్వే ప్రక్రియలో భాగంగా వివిధ అంశాలపై అన్ని జిల్లాల కలెక్టర్లు, జేసీ లతో వీడియో కాన్ఫరెన్సు ద్వారా సమీక్షించారు. ఈ కార్యక్రమానికి స్థానిక కలెక్టరేట్ బోర్డు మీటింగ్ హాలు నుండి జిల్లా కలెక్టర్ డా. శ్రీధర్ చెరుకూరితో పాటు.. జేసీ నిధి మీనా హాజరయ్యారు.సీసీఎల్ఏ ప్రత్యేక కార్యదర్శి విసి ముగిసిన అనంతరం.. జిల్లాలోని అన్ని మండలాల రెవెన్యూ అధికారులతో విసి ద్వారా సమీక్షించారు. ఈ సందర్భంగా సీసీఎల్ఏ ముఖ్య కార్యదర్శి వారి సూచనల మేరకు.. జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాలో ఇప్పటి వరకు పెండింగ్ లో ఉన్న రీసర్వే పూర్తి చేయాల్సిన గ్రామాలను.. ప్రతి నెలా ప్రతి నియోజకవర్గానికి 2 గ్రామాలను ప్రతినెలా 3వ వారంలోపు పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. మ్యూటేషన్ లో భాగంగా సేల్, సబ్ డివిజన్, జాయింట్ ఎల్పిఎం తదితర వ్యక్తిగత వివరాలలో ఎటువంటి తప్పిదాలు లేకుండా పూర్తి చేసి పట్టాదారు పాసు పుస్తకాలను పంపిణీ చేసేలా.చర్యలు చేపట్టాలన్నారు. రీసర్వే కార్యక్రమంలో క్షేత్రస్థాయిలో ఎదురయ్యే సాంకేతిక సమస్యల పరిష్కారానికి ఎలాంటి ఆటంకాలు రాకుండా చర్యలు తీసుకోవాలన్నారు. వివాదాలు లేని భూ రికార్డుల రూపకల్పన కోసమే ఈ రీసర్వే కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఆధునిక పరిజ్ఞానంతో అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిందన్నారు. అలాగే.. భూ సమస్యలపై పిజిఆర్ఎస్ ద్వారా అందే అర్జీల పట్ల.. సదరు అర్జీ ప్రాథమిక పరిశీలన దశలో ఉన్నట్టు సమాచారం అర్జీదారులకు అందించడం బాధ్యతగా చేపట్టాలన్నారు. ఈ విసి కార్యక్రమంలో రాజంపేట సబ్ కలెక్టర్ భావన, కడప, జమ్మలమడుగు, బద్వేలు, పులివెందుల రెవెన్యూ డివిజన్ల నుండి ఆర్డీవోలు జాన్ ఇర్విన్, సాయిశ్రీ, చంద్ర మోహన్, చిన్నయ్య లు హాజరవ్వగా కలెక్టరేట్ బోర్డు మీటింగ్ హాలు నుండి ల్యాండ్ సర్వే శాఖ ఈడి శాంతరాజు, సంబంది సెక్షన్ సూపరింటెండెంట్లు, రెవెన్యూ అధికారులు సంబందిత శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.
