- నేషనల్ స్టాటిస్టిక్స్ ఎఫ్ ఓ డి కడప జాయింట్ డైరెక్టర్ నీతూ థామస్
కడప, మహి న్యూస్ ఫిబ్రవరి 25 : కుటుంబ సరాసరి ఆదాయ వనరులను పెంచే ప్రణాళికలు రూపొందించటానికి జాతీయ గృహ ఆదాయ సర్వేలు ఎంతగానో ఉపయోగపడుతాయని, తద్వారా అత్యుత్తమ భారత సమాజ స్థాపన సాధ్యం అవుతుందని నేషనల్ స్టాటిస్టిక్స్ ఆఫీస్ (ఎన్ .ఎస్ .ఒ ) జాయింట్ డైరెక్టర్ నీతూ థామస్ పేర్కొన్నారు.
బుధవారం కడపలోని ఆర్.ఎస్ .ఆర్ స్క్వేర్ మాల్ లో గణాంక సర్వే నిర్వహణపై నేషనల్ స్టాటిస్టిక్స్ ఆఫీస్ (ఎన్ .ఎస్ .ఒ ) -ఫీల్డ్ ఆపరేషన్ డివిజన్ (ఎఫ్ ఓ డి ) కడప ప్రాంతీయ కార్యాలయం వారి ఆధ్వర్యంలో రోజుల పాటు నిర్వహిస్తున్న ప్రాంతీయ శిక్షణా శిబిరం (ఆర్టీసీ)కు జాయింట్ డైరెక్టర్ నీతూ థామస్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. 2026 ఏప్రిల్ 1 నుండి దేశవ్యాప్తంగా ప్రారంభం కానున్న జాతీయ గృహ ఆదాయ సర్వేలో భాగంగా, క్షేత్రస్థాయిలో సర్వే నిర్వహించే అధికారులకు మరియు సిబ్బందికి సర్వేలోని ముసాయిదాలు, నిర్వచనాలు మరియు సాంకేతిక అంశాలపై పూర్తి అవగాహన కల్పించడం కోసం రెండు రోజుల పాటు ప్రాంతీయ శిక్షణా శిబిరం (ఆర్టీసీ) ను భారత ప్రభుత్వ గణాంక మరియు కార్యక్రమ అమలు మంత్రిత్వ శాఖకు చెందిన నేషనల్ స్టాటిస్టిక్స్ ఆఫీస్ (ఎన్.ఎస్.ఓ) -ఫీల్డ్ ఆపరేషన్ డివిజన్ (ఎఫ్ ఓ డి) కడప ప్రాంతీయ కార్యాలయం వారి ఆధ్వర్యంలో నిర్వహించడం ఎంతో ఉపయోగకరం అన్నారు.

కార్యక్రమంలో మాస్టర్ ట్రైనర్ మరియు అసిస్టెంట్ డైరెక్టర్ ఆయిన శ్రీనివాస రావు మాట్లాడుతూ.. ముఖ్యంగా కుటుంబం యొక్క సరాసరి ఆదాయ వనరులను పెంచడానికి కావలిసిన ప్రణాళికలు రూపొందించటానికి ఎంతో ఉపయోగపడుతుందన్నారు. అర్హులైన వారికి సంక్షేమ పథకాలు నేరుగా పారదర్శకంగా లక్షిత వర్గాలకు చేరడానికి, ఉపాధి అవకాశాలు మరియు నైపుణ్యాభివృద్ధి గుర్తించడం, పెట్టుబడిదారులకు అనుకూలమైన వాతావరణాన్ని సృష్టించడానికి ఈ సర్వే గణాంకాలు ప్రాధాన్యత వహిస్తాయన్నారు.
ఈ కార్యక్రమాన్ని ఎన్ఎస్ఓ- ఫీల్డ్ ఆపరేషన్ డివిజన్ కడప ప్రాంతీయ కార్యాలయ అధిపతి మరియు ఎస్ఎస్ఓ. ప్రశాంతి పర్యవేక్షించి ప్రజలందరూ గణాంక అధికారులకు సహకరించి ఖచ్చితమైన వివరాలను అందించాలన్నారు.
ఈ శిక్షణ తరగతులలో ఉమ్మడి జిల్లాల ఉప ప్రాంతీయ కార్యాలయాలు అయిన కడప, అనంతపురం, కర్నూలు, నెల్లూరు మరియు గుంటూరు జిల్లాలకు సంబంధించిన ఎస్. ఎస్.ఓ అధికారులు మరియు క్షేత్రస్థాయి సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

