కడప అభివృద్ధిపై కూటమి ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంది: భూపేష్ సుబ్బరామిరెడ్డి
కడప జిల్లా/జమ్మలమడుగు జూలై 16 (మహి న్యూస్): కడప జిల్లా అభివృద్ధికి కూటమి ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తోందని తెలుగుదేశం పార్టీ కడప జిల్లా అధ్యక్షుడు భూపేష్ సుబ్బరామిరెడ్డి అన్నారు. కడప జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.
కడప జిల్లాలో సోలార్ ప్లాంట్, స్టీల్ ప్లాంట్ పనులు ప్రారంభం కావడం, దాల్మియా సిమెంట్ రెండో ప్లాంట్ నిర్మాణానికి శ్రీకారం చుట్టడం ద్వారా జిల్లాలోని యువతకు ఉపాధి అవకాశాలపై భరోసా కలిగించామని పేర్కొన్నారు.
2019 నుంచి 2024 వరకు జిల్లాకు కొత్త పెట్టుబడులు రాలేదని, గత ప్రభుత్వం కడప అభివృద్ధిని విస్మరించిందని విమర్శించారు. “కడప బిడ్డను” అని చెప్పుకుని ప్రజల ఓట్లు పొందిన మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి జిల్లావాసులను మోసం చేశారని ఆరోపించారు. గత పాలకులు కడపను అభివృద్ధి కోసం కాకుండా రాజకీయ ప్రయోజనాల కోసమే ఉపయోగించుకున్నారని అన్నారు.
వైసీపీ నాయకులు ఎంత గట్టిగా మాట్లాడినా ప్రజలు భయపడే పరిస్థితి లేదని పేర్కొన్నారు. వైసీపీ ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డి పదవిలో ఉన్న సమయంలో జమ్మలమడుగులో చెప్పుకోదగ్గ అభివృద్ధి జరగలేదని విమర్శించారు. డ్రామాలు పక్కనపెట్టి జమ్మలమడుగు అభివృద్ధికి సహకరించాలని ఆయనకు సూచించారు.
శివారెడ్డి మరణం తర్వాత రామసుబ్బారెడ్డి పదవులు మాత్రమే అనుభవిస్తున్నారని, జమ్మలమడుగు అభివృద్ధిపై ఆయనకు ఆసక్తి లేదని ఆరోపించారు.
దాల్మియా సిమెంట్ రెండో ప్లాంట్ ఏర్పాటులో స్థానికులకు న్యాయం జరిగేలా కఠినమైన నిబంధనలు అమల్లో ఉన్నాయని తెలిపారు. ఇందులో భాగంగా సంస్థ ఇప్పటికే రూ.5 కోట్ల నిధులను అందజేసిందని చెప్పారు.
ఈ మీడియా సమావేశంలో తెలుగుదేశం పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి జబీవుల్లా, బొమ్మిచెట్టు చంద్రశేఖర్, నజీముద్దీన్, తిరుమలేష్, యాల్లారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
0 Comments