విజయవాడ, సెప్టెంబర్ 6 (మహి న్యూస్):
ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివారి దేవస్థానంలో ఆదివారం ఉదయం సూర్యోపాసన సేవను భక్తిశ్రద్ధలతో వైభవంగా నిర్వహించారు. లోకకల్యాణం, భక్తుల క్షేమాన్ని ఆకాంక్షిస్తూ ఆలయ వేద పండితులు శాస్త్రోక్తంగా పూజా కార్యక్రమాలు నిర్వహించారు.
ఈ సందర్భంగా అరుణ పారాయణం, మహాసౌర పారాయణం, సూర్య అష్టోత్తర శతనామావళి పఠిస్తూ సూర్యభగవానుడికి ప్రత్యేక అర్చనలు చేశారు. సూర్యోపాసన వల్ల ఆరోగ్యం, తేజస్సు, మానసిక ప్రశాంతత కలుగుతాయని వేద పండితులు తెలిపారు. ఆదివారం సూర్యభగవానుడికి ప్రీతికరమైన రోజు కావడంతో ఈ సేవకు విశేష ప్రాధాన్యత ఉందన్నారు.
సూర్యోపాసన అనంతరం కనకదుర్గమ్మ అమ్మవారికి ప్రత్యేక హారతులు సమర్పించి, భక్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో దేవస్థానం అధికారులు, అర్చకులు, వేద పండితులు, భక్తులు పాల్గొన్నారు.
0 Comments