గుంటూరు, ఆగస్టు 2 (మహి న్యూస్): గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 179వ సచివాలయం (అడవి తక్కెళ్ళపాడు-02) వద్ద ఎన్టీఆర్ భరోసా పెన్షన్ కోసం వృద్ధులు, దివ్యాంగులు గంటల తరబడి వేచి ఉండాల్సిన పరిస్థితి నెలకొంది. సకాలంలో పెన్షన్ అందక లబ్ధిదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పథకం కింద ప్రతి నెల 1వ తేదీన లబ్ధిదారుల ఇంటి వద్దకే వెళ్లి పెన్షన్ అందించాలని ఆదేశాలు జారీ చేసినప్పటికీ, 179వ సచివాలయం పరిధిలో మాత్రం పరిస్థితి భిన్నంగా ఉందని లబ్ధిదారులు ఆరోపిస్తున్నారు.
“సర్వర్ పనిచేయడం లేదు” అనే కారణంతో ఇంటి వద్దకు వచ్చి పెన్షన్ పంపిణీ చేయకుండా సచివాలయానికి పిలిపిస్తున్నారని, అక్కడ ఉదయం నుంచి సాయంత్రం వరకు నిరీక్షించాల్సి వస్తోందని వృద్ధులు, దివ్యాంగులు వాపోతున్నారు. కొందరు మధ్యాహ్న భోజనం కూడా చేయకుండా అక్కడే ఉండాల్సి వస్తోందని తెలిపారు.
గత కొన్ని నెలలుగా ఇదే పరిస్థితి కొనసాగుతోందని, సంబంధిత అధికారులు వెంటనే స్పందించి సమస్యను పరిష్కరించాలని లబ్ధిదారులు కోరుతున్నారు. రాష్ట్రంలోని ఇతర సచివాలయాల మాదిరిగానే ప్రతి నెల 1వ తేదీన తమ ఇంటి వద్దకే పెన్షన్ అందేలా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నారు.
0 Comments