శ్రీకాకుళం మహి న్యూస్ సెప్టెంబర్ 12: శ్రీకాకుళం ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి (జీజీహెచ్)లో రూ.23.75 కోట్ల వ్యయంతో నిర్మించిన 50 పడకల క్రిటికల్ కేర్ బ్లాక్ను ప్రారంభించడం ఎంతో సంతోషంగా ఉందని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు అన్నారు. శనివారం నాడు వర్చువల్ విధానంలో కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ బ్లాక్ ను ప్రారంభించడం శుభపరిణామం అని అన్నారు. ఈ మేరకు డిల్లీ లోని కార్యాలయం నుండి తన సందేశాన్ని విడుదల చేశారు.
ఈ బ్లాక్ అందుబాటులోకి రావడంతో అత్యవసర, క్లిష్ట పరిస్థితుల్లో చికిత్స అందించే జీజీహెచ్ సామర్థ్యం మరింత పెరుగుతుందని తెలిపారు.
కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్, రాష్ట్ర మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు, స్థానిక ఎమ్మెల్యే గొండు శంకర్, వైద్యులు, వైద్య సిబ్బంది, అధికారులు, శ్రీకాకుళం జిల్లా ప్రజలకు కేంద్ర మంత్రి ఈ సందర్భంగా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు.
శ్రీకాకుళం ఎంపీగా జీజీహెచ్ తనకు ఎంతో ప్రత్యేకమైనదని రామ్మోహన్ నాయుడు పేర్కొన్నారు. “జీజీహెచ్ కేవలం ఒక ఆసుపత్రి కాదు.. పేద, మధ్యతరగతి కుటుంబాలకు అత్యవసర సమయంలో అండగా నిలిచే దేవాలయం లాంటిది” అని అన్నారు. ప్రతిరోజూ వేలాది మంది ప్రజలు వైద్యం కోసం ఆసుపత్రికి వస్తున్నారని, వారికి మెరుగైన వైద్య సేవలు అందించడం తమ బాధ్యత అని స్పష్టం చేశారు.
కేంద్ర మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం జీజీహెచ్ అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి పెట్టి నిరంతరం సమీక్షలు నిర్వహిస్తున్నామని తెలిపారు. వైద్యులు, సిబ్బంది, రోగుల నుంచి నేరుగా అవసరాలు, సమస్యలు, సూచనలు తెలుసుకుని వాటి పరిష్కారానికి చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు.
*అత్యాధునిక వైద్య సదుపాయాలు*
రూ.23.75 కోట్ల వ్యయంతో నిర్మించిన క్రిటికల్ కేర్ బ్లాక్లో అత్యవసర వైద్య సేవలకు అవసరమైన కీలక సదుపాయాలను అందుబాటులోకి తీసుకువచ్చామని తెలిపారు. ఇందులో ఎంసీహెచ్ సదుపాయాలు, డయాలసిస్, ఎమర్జెన్సీ వార్డులు, ఐసీయూ వార్డు, ఆపరేషన్ థియేటర్లు, క్యాథ్ ల్యాబ్, సీసీయూ వంటి ఆధునిక వైద్య సదుపాయాలు ఉంటాయని వివరించారు.
“ఇవి కేవలం కొత్త భవనాలు, కొత్త పడకలు మాత్రమే కాదు. అత్యవసర పరిస్థితుల్లో ఒక కుటుంబానికి అందించే ఆశ.. ఒక ప్రాణాన్ని కాపాడే అవకాశం.. పేద కుటుంబానికి అందే నాణ్యమైన వైద్యం” అని రామ్మోహన్ నాయుడు అన్నారు.
*CSR సహకారంతో మరిన్ని వైద్య పరికరాలు*
జీజీహెచ్లో ఆధునిక వైద్య పరికరాల అందుబాటుపై కూడా ప్రత్యేక దృష్టి సారించామని కేంద్ర మంత్రి తెలిపారు. గత ఏడాది బోయింగ్ సంస్థ సహకారంతో సుమారు రూ.45 లక్షల విలువైన వైద్య పరికరాలను ఆసుపత్రికి అందించామని చెప్పారు.
అదేవిధంగా ఐఓసీఎల్ సహకారంతో సుమారు రూ.4.50 కోట్ల విలువైన ఆధునిక వైద్య పరికరాలను అందించేందుకు ఎంఓయూ పూర్తయిందని, ఈ పరికరాలను త్వరలోనే ఆసుపత్రికి తీసుకురానున్నామని తెలిపారు.
జీజీహెచ్లో లెక్చర్ హాల్, ఆడిటోరియం, హాస్టల్ బ్లాకులను పూర్తి స్థాయిలో వినియోగంలోకి తీసుకురావడానికి ఉన్న సమస్యలను పరిష్కరిస్తున్నామని చెప్పారు. సుమారు రూ.2 కోట్ల విలువైన ఫర్నిచర్ అవసరాలను కూడా పరిష్కరించి, వైద్య విద్యార్థులు, సిబ్బంది, ప్రజలకు మౌలిక వసతులను అందుబాటులోకి తీసుకురావడానికి చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.
*పారిశుధ్యానికి ప్రత్యేక ప్రాధాన్యం*
ఆసుపత్రిలో వైద్య సేవలతో పాటు పరిశుభ్రమైన వాతావరణం, పారిశుధ్యం, డ్రైనేజీ వ్యవస్థ కూడా ఎంతో ముఖ్యమని రామ్మోహన్ నాయుడు అన్నారు. జీజీహెచ్ ప్రాంగణంలో డ్రైనేజీ, శానిటేషన్, పరిసరాల అభివృద్ధి కోసం ఐఓసీఎల్ CSR నిధుల ద్వారా సుమారు రూ.80 లక్షల పనులు చేపడుతున్నట్లు వెల్లడించారు.
“రోగులకు, వారి కుటుంబ సభ్యులకు, వైద్యులు, సిబ్బందికి మెరుగైన, ఆహ్లాదకరమైన వాతావరణాన్ని కల్పించడమే మా లక్ష్యం” అని అన్నారు.
*ప్రతి PHC, CHCను బలోపేతం చేయడమే లక్ష్యం*
జీజీహెచ్ను మాత్రమే కాకుండా శ్రీకాకుళం జిల్లాలోని ప్రతి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం (PHC), కమ్యూనిటీ హెల్త్ సెంటర్ (CHC)ను బలోపేతం చేయడమే ఎన్డీఏ ప్రభుత్వ లక్ష్యమని కేంద్ర మంత్రి తెలిపారు.
ప్రజలు ప్రతి చిన్న వైద్య అవసరానికి జిల్లా కేంద్రానికి వచ్చే పరిస్థితి ఉండకూడదని, వారి ఇళ్లకు సమీపంలోనే నాణ్యమైన వైద్య సేవలు అందుబాటులో ఉండేలా ఆరోగ్య మౌలిక వసతులను అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందన్నారు.
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో దేశవ్యాప్తంగా ఆరోగ్య మౌలిక వసతులను బలోపేతం చేస్తూ ఆధునిక వైద్య సేవలను సామాన్య ప్రజలకు అందుబాటులోకి తీసుకువస్తున్నామని తెలిపారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో, రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ సహకారంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి శ్రీకాకుళం ఆరోగ్య రంగాన్ని మరింత బలోపేతం చేసేందుకు కృషి చేస్తున్నాయని చెప్పారు.
“శ్రీకాకుళం ప్రజల ఆరోగ్యం మన బాధ్యత.. ప్రతి కుటుంబానికి నాణ్యమైన వైద్యం అందడం మన లక్ష్యం.. ప్రతి ప్రభుత్వ ఆసుపత్రిని ప్రజలకు నమ్మకమైన వైద్య కేంద్రంగా మార్చడం మన సంకల్పం” అని రామ్మోహన్ నాయుడు స్పష్టం చేశారు.
జీజీహెచ్లో క్రిటికల్ కేర్ బ్లాక్ ప్రారంభం శ్రీకాకుళం ఆరోగ్య రంగాన్ని బలోపేతం చేసే ప్రయాణంలో ఒక ముఖ్యమైన మైలురాయిగా నిలుస్తుందని అన్నారు.
ఈ కార్యక్రమానికి సహకరించిన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, ఆరోగ్య శాఖ, జీజీహెచ్ వైద్యులు, వైద్య సిబ్బంది, అధికారులు, CSR భాగస్వామ్య సంస్థలకు కేంద్ర మంత్రి కృతజ్ఞతలు తెలిపారు. ప్రజలకు అంకితభావంతో సేవలందిస్తున్న వైద్యులు, సిబ్బందికి ప్రత్యేక అభినందనలు తెలిపారు.
“మనమందరం కలిసి పనిచేస్తే జీజీహెచ్ను మరింత బలోపేతం చేయగలం.. శ్రీకాకుళం జిల్లాలో PHCలు, CHCలను మరింత అభివృద్ధి చేయగలం.. ప్రజలకు మరింత మెరుగైన వైద్య సేవలు అందించగలం. మన శ్రీకాకుళం ఫిట్ అండ్ హెల్తీ శ్రీకాకుళంగా మారాలి” అని కేంద్ర మంత్రి ఆకాంక్షించారు.
ప్రజల ఆరోగ్యం, సంక్షేమం కోసం సహకరిస్తున్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్లకు కేంద్ర మంత్రి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
0 Comments