జిల్లాలో ఎస్ఐఆర్ ప్రక్రియ వేగవంతంగా కొనసాగుతోంది..! జిల్లా కలెక్టర్ డా. శ్రీధర్ చెరుకూరి
కడప, మహి న్యూస్ జూలై 16: జిల్లాలో ప్రత్యేక ఓటరు జాబితా సమగ్ర సవరణ (ఎస్ఐఆర్–2026) కార్యక్రమం నిర్దేశిత ప్రణాళిక ప్రకారం విజయవంతంగా కొనసాగుతోందని జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి డా. శ్రీధర్ చెరుకూరి తెలిపారు.
గురువారం విజయవాడ నుండి SIR నిర్వహణ, పురోగతిపై.. రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి వివేక్ యాదవ్.. అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.
ఈ వీడియో కాన్ఫరెన్స్ కు కడప కలెక్టరేట్ బోర్డు మీటింగ్ హాలు నుండి జిల్లా కలెక్టర్ డా. శ్రీధర్ చెరుకూరి తోపాటు జేసీ డా. నిధీమీనా, సబ్ కలెక్టర్ హెచ్.ఎస్. భావన, డిఆర్వో మల్లికార్జునుడు, సంబంధిత అధికారులు హాజరయ్యారు. ఈ సందర్భంగా జిల్లాలో జరుగుతున్న ఎస్ఐఆర్ కార్యక్రమం పురోగతిని జిల్లా కలెక్టర్ రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారికి వివరించారు.
జిల్లాలోని 18,96,231 మంది ఓటర్లకు సంబంధించిన గణన పత్రాల పంపిణీని 100 శాతం పూర్తి చేసినట్లు కలెక్టర్ తెలిపారు. అలాగే ఇప్పటివరకు 16,46,067 గణన పత్రాలను డిజిటలీకరించి, 86.81 శాతం పురోగతి సాధించినట్లు వివరించారు.
ఓటర్ల వివరాల ధృవీకరణలో భాగంగా 2,50,109 మంది ఏఎస్డీ (గైర్హాజరు, మరణించిన, శాశ్వతంగా నివాసం మార్చుకున్న తదితర) ఓటర్లను పునఃపరిశీలించినట్లు తెలిపారు. అదేవిధంగా 1,12,679 నో మ్యాపింగ్ కేసులు, 3,40,730 లాజికల్ వ్యత్యాసాల కేసులను గుర్తించి పరిష్కార చర్యలు కొనసాగుతున్నాయని పేర్కొన్నారు.
ఓటర్ల ఫొటోల నాణ్యత మెరుగుదల, లోపాల సవరణ, పోలింగ్ కేంద్రాల హేతుబద్ధీకరణ వంటి అంశాలను ప్రత్యేకంగా పర్యవేక్షిస్తున్నామని తెలిపారు. ఎన్నికల నమోదు అధికారులు, సహాయ ఎన్నికల నమోదు అధికారులు, బూత్ స్థాయి అధికారులు సమన్వయంతో ఎస్ఐఆర్ ప్రక్రియను పారదర్శకంగా, సమయపాలనతో పూర్తి చేసేందుకు చర్యలు చేపట్టినట్లు జిల్లా కలెక్టర్ రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారికి వివరించారు.
రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వీడియో కాన్ఫరెన్స్ ముగిసిన అనంతరం జిల్లా కలెక్టర్ డా. శ్రీధర్ చెరుకూరి జిల్లాలోని ఎన్నికల నమోదు అధికారుల (ఈఆర్వోలు)తో సమీక్షించారు.
ఈ సందర్భంగా.. ఎస్ఐఆర్ కార్యక్రమంలో మిగిలిన ప్రక్రియలను వేగవంతం చేసి, ఈ నెల 22వ తేదీలోగా జిల్లాలో ఎస్ఐఆర్ కార్యక్రమాన్ని 100 శాతం పూర్తి చేసేలా ప్రత్యేక చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ఇంటింటి సందర్శన, గణన పత్రాల సేకరణ, డిజిటైజేషన్, ఓటరు వివరాల ధృవీకరణ, పెండింగ్లో ఉన్న కేసుల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు.
ప్రతి బూత్ స్థాయి అధికారితో నిరంతరం సమన్వయం కొనసాగిస్తూ, అర్హులైన ప్రతి ఓటరి వివరాలు ఓటరు జాబితాలో నమోదు అయ్యేలా ఈఆర్వోలు పర్యవేక్షించాలని జిల్లా కలెక్టర్ ఆదేశించారు.
ఈ కార్యక్రమంలో ఈఆర్వోలు మురళి, శిరీష, చంద్రమోహన్, చిన్నయ్య, వెంకటపతి, జాన్ ఇర్విన్, నీలమయ్య, ప్రతాప్ రెడ్డి తదితరులు. పాల్గొన్నారు.
0 Comments