కలలపై రాజీ పడొద్దు.. లక్ష్యం చేరేవరకు పట్టుదలతో శ్రమించండి..!!* * *విద్యార్థులకు పిలుపునిచ్చిన జిల్లా కలెక్టర్ డా. శ్రీధర్.చెరుకూరి
*సైనింగ్ స్టార్ - 2026 అవార్డు క్రింద ఒక్కొక్కరికీ రూ. 20 వేలు చొప్పున బహుకరణ*
* *జిల్లాలో 33 మంది ఇంటర్, 248 మంది టెన్త్ విద్యార్థులకు కలిపి మొత్తం మొత్తం రూ.56,20,000 లు విడుదల*
కడప, మహి న్యూస్ జూలై 20 : విద్యార్థులు తమ కలలు, జీవిత లక్ష్యాలపై ఎప్పుడూ రాజీ పడకుండా, అవి నెరవేరే వరకు నిరంతరం కృషి చేయాలని జిల్లా కలెక్టర్ డా. శ్రీధర్ చెరుకూరి పిలుపునిచ్చారు.
సోమవారం కడపలోని మాధవి కన్వెన్షన్ హాలులో.. 2025-26 విద్యా సంవత్సరంలో 10వ తరగతి, ఇంటర్మీడియట్ లో జిల్లా స్థాయిలో అత్యుత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులకు షైనింగ్ స్టార్స్-2026 పేరుతో రాష్ట్ర ప్రభుత్వం రూ. 20 వేల నగదు బహుమతి, సర్టిఫికేట్, మెడల్స్ బహుకరించి.. సత్కారంచే కార్యక్రమం ఘనంగా జరిగింది.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జిల్లా కలెక్టర్ శ్రీధర్ చెరుకూరి తోపాటు రాజంపేట సబ్ కలెక్టర్ హెచ్.ఎస్. భావన, ఎమ్మెల్సీ ఎం.వి. రామచంద్రారెడ్డి, రాష్ట్ర షేక్ డెవెలప్మెంట్ కార్పోరేషన్ చైర్మన్ వి.ఎస్. ముక్తియార్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ డి. భానుప్రకాశ్ లు హాజరయ్యారు.
** ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ... రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న "షైనింగ్ స్టార్స్-2026" అవార్డులు విద్యార్థుల ఉన్నత చదువులు, ఉజ్వల భవిష్యత్తుకు ప్రోత్సాహాన్ని అందిస్తాయన్నారు. ప్రపంచంలో ప్రతి ఒక్కరికీ ఒక్కో ప్రతిభ ఉందని, ఆశయం ఏదైనా కావచ్చని, ఆ రంగంలో నిష్ణాతులుగా ఎదిగి ప్రపంచ చరిత్రలో మన పేరు లిఖించబడాలి అన్న ఆశయంతో ముందుకు సాగాలన్నారు.
లక్ష్యాన్ని నిర్దేశించుకోవడం కష్టం కాదని, లక్ష్యాన్ని చేరుకోవడంలో ప్రణాళిక ప్రకారం, దృఢ సంకల్పంతో అడుగులేయలన్నారు. ఈ ఆశయ సాధనలో మీరంతా మొదటి మెట్టు ఎక్కరన్నారు. ఈ రోజు విద్యార్థుల అభ్యసనం, కృషి, పట్టుదల ఆశయాలకు రెక్కలు వచ్చిన రోజుగా ఆయన అభివర్ణించారు.
మన విజయానికి చేయుతను ఇచ్చిన వారిని భవిష్యత్తులో ఎన్నడూ మారువకూడదన్నారు. మీ లక్ష్యాలను ఎప్పుడు కూడా.. వెనుకంజలో నడిపించకూడదు అని సూచించారు. అదే విధంగా ఈ రోజు మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు, విద్యాశాఖ మంత్రి లోకేష్ ఆలోచించి.. పిల్లలో ప్రతిభను వెలికి తీయాలి, వాళ్లని ప్రోత్సహించాలి, వెన్ను తట్టి లేపాలన్ని సదుద్దేశంతో ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తోందని చెప్పారు.
సమాజంలో నేడు ఎంతో పోటీ ఉందని, పిల్లల్లో కూడా ఒక్కొక్కరిలో ఒక్కొక్క రకమైన ప్రతిభ దాగి వుంటుందన్నారు. పిల్లల్లో ఉన్న ప్రతిభను తల్లిదండ్రులు గుర్తించాలన్నారు. పాఠశాలల్లో ఉపాధ్యాయులు కూడా విద్యార్థుల అభీష్టాన్ని గుర్తెరిగి, వారిలోని నైపుణ్యాలను వెన్ను తట్టి లేపి ప్రోత్సహించాలన్నారు.
ఒక ఐఏఎస్ అధికారి తొలి ప్రయత్నంలో విఫలమైనా, రెండోసారి మరో ప్రభుత్వ ఉద్యోగం వచ్చినా అక్కడితో ఆగకుండా, తన అసలు లక్ష్యమైన ఐఏఎస్ సాధించేందుకు ఏడాది పాటు ప్రతిరోజూ 15 నుంచి 19 గంటలు కష్టపడి చివరకు విజయం సాధించారని సబ్ కలెక్టర్ భావన ను ఉదాహరణగా వివరించారు. జీవితంలో మధ్యలో లభించే విజయాలతో సంతృప్తి చెందకుండా, అసలు లక్ష్యాన్ని చేరుకునే వరకు పట్టుదలతో ముందుకు సాగాలని సూచించారు.
పాఠశాల లేదా కళాశాలలో మొదటి ర్యాంకు సాధించడం విజయమే అయినప్పటికీ, దానినే అంతిమ గమ్యంగా భావించకూడదన్నారు. ఉన్నత లక్ష్యాలను నిర్దేశించుకుని నిరంతరం శ్రమిస్తేనే గొప్ప విజయాలు సాధించగలరని చెప్పారు. ఒకరి విజయం మరెందరికో స్ఫూర్తిగా నిలవాలని ఆకాంక్షించారు.
విద్యార్థులు తమ లక్ష్యాలను స్పష్టంగా నిర్ణయించుకుని, వాటి సాధనకు పకడ్బందీ ప్రణాళిక రూపొందించుకోవాలని సూచించారు. ఉపాధ్యాయుల మార్గదర్శకత్వం, అనుభవజ్ఞుల సలహాలు తీసుకుంటూ ఒక్కో మెట్టు ఎక్కుతూ ముందుకు సాగాలని చెప్పారు. లక్ష్యాన్ని మనసులోనే దాచుకోకుండా, దాన్ని సాధించేందుకు అవసరమైన సహాయాన్ని తీసుకోవడంలో ఎలాంటి సంకోచం అవసరం లేదన్నారు.
"మీ కల మీదే... దానిని నిజం చేయాల్సిన బాధ్యత కూడా మీదే. ఎప్పటికీ ఓటమిని అంగీకరించొద్దు. 'నెవర్ గివ్ అప్' అనే తత్వంతో ముందుకు సాగండి" అని విద్యార్థులకు కలెక్టర్ సూచించారు.
విద్యకు రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యం ఇస్తోందని, విద్యార్థుల భవిష్యత్తు, ఉన్నత విద్య, ఉద్యోగావకాశాల కోసం అనేక సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు అమలు చేస్తోందన్నారు. "విద్యార్థులే దేశ భవిష్యత్తు. మీ కలలను నిజం చేసుకుని సమాజానికి ఆదర్శంగా నిలవాలి" అని జిల్లా కలెక్టర్ ఆకాంక్షించారు.
మనం ఎప్పుడూ నిత్య విద్యార్థిని అనే భావనతో ముందుకు సాగాలన్నారు. మన ఇంటి కోసం, మన సొంతం కోసమే కాకుండా.. మనతో పాటు సమాజం కోసం కూడా పాటుపడుతూ.. దేశ ప్రగతిలో భాగస్వాములు కావాలన్నారు. మనతో పాటు మన ఇల్లు, మన గ్రామం, మన జిల్లా అనే దృక్పథంతో నడవాలన్నారు.
*విద్యార్థుల విద్య పరంగా ప్రోత్సాహాన్నే కాకుండా వారి ఆరోగ్యంపై కూడా ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారిస్తోందన్నారు. ప్రభుత్వం అందిస్తున్న సహాయ సహకారాలను అందుకుంటూ.. దేశానికే స్ఫూర్తిదాయకంగా జిల్లాలో అమలు చేస్తున్న "స్మార్ట్ కిచెన్ వ్యవస్థ" ద్వారా విద్యార్థులకు సంపూర్ణ ఆరోగ్యకరమైన స్వచ్ఛమైన రుచికరమైన మధ్యాహ్నం భోజనాన్ని అందిస్తున్నామన్నారు. ఈ స్మార్ట్ కిచన్ వ్యవస్థ నిర్వహణపై విద్యార్థులు, తల్లిదండ్రులు వారి అభిప్రాయాలను కూడా తెలియజేయాలన్నారు. స్మార్ట్ కిచెన్ ద్వారా అందించే.. మధ్యాహ్న భోజనాన్ని సద్వినియోగం చేసుకుంటూ వారి ఆరోగ్యాన్ని మరింత కాపాడుకుంటూ.. వారి లక్ష్యాల వైపు అడుగులు వేయాలని జిల్లా కలెక్టర్ సూచించారు.
** ఎమ్మెల్సీ ఎం.వి. రామచంద్రారెడ్డి మాట్లాడుతూ... మనం ఎదుగుతూనే మన సమాజంలో తోటి వారి ఎదుగుదలను కూడా ఆకాంక్షించే.. మనస్తత్వాన్ని అలవర్చుకోవాలన్నారు. సమాజంలో ఇంకనూ అభివృద్ధి చెందాల్సిన వారు ఎంతో మంది ఉన్నారని, వారి బంగారు భవిష్యత్తుకు సహకారం అందించాలన్నారు. జిల్లాలో 10వ తరగతి, 12వ తరగతిలో ఉత్తమ ప్రతిభ కనబరిచి షైనింగ్ స్టార్స్ గా అత్యుత్తమ ప్రతిభ కలిగిన విద్యార్థులుగా అవార్డులు అందుకున్న వారు.. భవిష్యత్తులో ఉన్నత విడులతో పాటు, అత్యున్నత శిఖరాలను అధిరోహించాలన్నారు.
** సబ్ కలెక్టర్ భావన మాట్లాడుతూ... తల్లిదండ్రుల ఆశలను, కలలను సఫలీకృతం చేస్తున్న విద్యార్థులకు అభినందనలు తెలియజేస్తున్నానన్నారు. రాష్ట్ర.ప్రభుత్వం విద్యార్థుల భవిష్యత్తుకు బంగారు బాటలు వేస్తూ... షైనింగ్ స్టార్స్ అవార్డులను అమలు చేయడం గర్వించదగ్గ విషయం అన్నారు. విద్యార్థులను ప్రోత్సహించడమే కాకుండా వారి విద్యకు ఆర్థిక చేయూతను ఇవ్వడం అభినందనీయం అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం విద్య విధానంలో సమూలమైన మార్పులతో విద్యాభివృద్దికి దోహదపడుతోందన్నారు.
చిన్నప్పటి నుండి కూడా ఇప్పటికే ఎన్నో లక్ష్యాలను ఛేదించి విజయాలను అందుకుని ఉంటారని.. అక్కడక్కడా ఎదురయ్యే ఓటములను గుణపాఠాలుగా గుర్తించి చక్కటి భవిష్య ప్రణాళికతో ప్రభుత్వం అందించే సహాయ సహకారాలను అందుకోవాలన్నారు.
** పాఠశాల విద్య ఆర్జేడీ కె. శ్యామియేలు మాట్లాడుతూ... తల్లిదండ్రులు మనకు అందించిన అవకాశాలను గుర్తెరిగి మన విద్యా, ప్రతిభ ద్వారా వారి గౌరవాన్ని మరింత పెంచేలా విలువలతో కూడిన విద్యను అభ్యసిస్తూ భవిష్యత్తులో ఉన్నత పదవులు, అధికారాలను అధిరోహించాలని విద్యార్థులను కోరారు.
** ఆర్ఐఓ & డివిఎవో ప్రకాష్ రావు పట్నాయక్ మాట్లాడుతూ.. విద్యార్థులకు మార్కులు ముఖ్యం కాదని, నిరంతర కొత్త విషయాలు నేర్చుకోవడంతో ఉన్నత స్థానాన్ని అధిరోహించారని, విద్యార్థులు కూడా అలాంటి గుణాన్ని అలవర్చుకుంటే ఏదైనా సాధించగలుగుతామన్నారు. తల్లిదండ్రులు విద్యార్థుల మనస్సును అర్థం చేసుకోవాలన్నారు. మీ లక్ష్యాలను వారిపై రుద్దకుండా వారి యొక్క లక్ష్యాలను సాదించడంలో తోడ్పాటును అందించాలన్నారు.
** ఏపిసి బి.అనురాధ మాట్లాడుతూ.. మానవతా విలువలను కోల్పోకుండా సమాజాన్ని గౌరవిస్తూ.. సమాజం కోసం, మన తల్లిదండ్రుల కలలను సాకారం చేసే దిశగా... అడుగులేయలన్నారు. కలెక్టర్ ఆధ్వర్యంలో ఒక మంచి ఆహ్లాదకరమైన వాతావరణంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన విద్యాశాఖ వారికి, అవార్డు పొందిన విద్యార్థులకు, వారి తల్లిదండ్రులకు అభినందనలు తెలియజేస్తున్నట్లు పేర్కొన్నారు.
** అనంతరం వైఎస్ఆర్ కడప జిల్లాలో 10వ తరగతిలో 248 మంది, ఇంటర్మీడియట్ లో 33 మంది అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన మొత్తం 281 మంది విద్యార్థులకు ఒక్కొక్కరికి రూ. 20వేలు చొప్పున మంజూరైన రూ. 56,20,000 ల మెగా చెక్కును, ప్రశంసా పత్రాలు, మెడల్ లను జిల్లా కలెక్టర్, ముఖ్య అతిధులతో కలిసి.. విద్యార్థులకు అందజేశారు.
** అంతకుముందుగా షైనింగ్ స్టార్ అవార్డు పొందిన విద్యార్థులు, వారి తల్లిదండ్రులు కార్యక్రమంలో తమ మనోభావాలను పంచుకొని... ప్రతిభ గలిగిన విద్యార్థులను వెన్ను తట్టి ప్రోత్సహించడంతోపాటు, విద్యాభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న కృషి పై తమ సంతోషాన్ని వ్యక్తపరిచారు.
ఈ కార్యక్రమంలో ఉప విద్యాశాఖ అధికారులు రాజగోపాల్ రెడ్డి, శివ ప్రసాద్, నాగయ్య, కళాశాలల ప్రిన్సిపాళ్లు, పాఠశాల ప్రధానోపాధ్యాయులు, లెక్చరర్లు, ఉపాధ్యాయులు, ఎంఈఓలు, విద్యార్థినీ విద్యార్థులు, తల్లిదండ్రులు, వివిధ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.
0 Comments