News that matters, as it happens
Friday, 11 September 2026
mahinewsindia.com
మా అధ్వాన్న రహదారికి మోక్షం కల్పించండి..!
మహి న్యూస్, రాజోలు, జులై 21:
డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజోలు నియోజకవర్గంలోని కోయిలా సెంటర్–అడ్డాలపాలెం నుంచి గుడిమూల పంచాయతీకి వెళ్లే ప్రధాన రహదారి చాలా కాలంగా అధ్వాన్న స్థితిలో ఉండటంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రహదారి అంతటా గుంతలు ఏర్పడి, వర్షాలు కురిసిన సమయంలో బురద, నీరు నిల్వ ఉండటంతో వాహనదారులు, పాదచారులు ప్రమాదాలకు గురవుతున్నారు.
ఈ రహదారిపై ప్రతిరోజూ విద్యార్థులు, రైతులు, ఉద్యోగులు, మహిళలు, అత్యవసర సేవల వాహనాలు రాకపోకలు సాగిస్తున్నప్పటికీ ఇప్పటి వరకు శాశ్వత మరమ్మతులు చేపట్టకపోవడం పట్ల స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సంబంధిత అధికారులు వెంటనే స్పందించి రహదారిని మరమ్మతు చేసి ప్రజలకు మెరుగైన ప్రయాణ సౌకర్యం కల్పించాలని గ్రామస్థులు కోరుతున్నారు.
రాజోలు నియోజకవర్గంలో అభివృద్ధి పనులకు ప్రాధాన్యం ఇస్తున్న ఎమ్మెల్యే దేవ వరప్రసాద్ దృష్టికి ఈ సమస్యను తీసుకెళితే రహదారి సమస్యకు త్వరితగతిన పరిష్కారం లభిస్తుందనే ఆశాభావాన్ని స్థానికులు వ్యక్తం చేస్తున్నారు. కూటమి ప్రభుత్వం ప్రజల అవసరాలను గుర్తించి అనేక రహదారులను అభివృద్ధి చేసిన నేపథ్యంలో, కోయిలా సెంటర్–అడ్డాలపాలెం–గుడిమూల పంచాయతీ రహదారిపై కూడా ప్రభుత్వ పెద్దలు ప్రత్యేక చొరవ చూపి అభివృద్ధి పనులు చేపట్టాలని ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు.
ప్రజల దైనందిన జీవితానికి ఎంతో కీలకమైన ఈ రహదారిని వెంటనే బాగుచేసి, సురక్షితమైన రాకపోకలకు అనువుగా మార్చాలని స్థానికులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.
📰
Official Article Source Link
https://mahinewsindia.com/post/30
0 Comments