కర్నూలు, జూలై 21 (మహి న్యూస్): నగర ప్రజలకు స్వచ్ఛమైన తాగునీటిని నిరంతరాయంగా అందించడంతో పాటు నీటి వృథా, కలుషితాన్ని పూర్తిగా నివారించేలా అధికారులు సమన్వయంతో పనిచేయాలని నగరపాలక సంస్థ కమిషనర్ చల్లా ఓబులేసు ఆదేశించారు.
మంగళవారం కమిషనర్ అశోక్నగర్, చదువుల రామయ్యనగర్, బుధవారపేట, రాజీవ్ గృహకల్ప ప్రాంతాల్లో పర్యటించి తాగునీటి సరఫరా, నీటి నాణ్యత, పైపులైన్ లీకేజీలను పరిశీలించారు. అనంతరం జొహరాపురం డంప్యార్డులోని నిర్మాణ వ్యర్థాల నిర్వహణ కేంద్రాన్ని సందర్శించి ప్లాంట్ పనితీరును పరిశీలించారు. అలాగే మండిబజార్, జమ్మిచెట్టు ప్రాంతాల్లో పారిశుద్ధ్య నిర్వహణను తనిఖీ చేసి అధికారులకు పలు సూచనలు చేశారు. కలెక్టరేట్ ప్రాంగణంలోని అన్న క్యాంటీన్ను కూడా పరిశీలించారు.
ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ తాగునీటి సరఫరా, పైపులైన్ల నిర్వహణ, లీకేజీల నివారణ, ప్రజల నుంచి వచ్చే ఫిర్యాదుల పరిష్కారంలో ఎలాంటి నిర్లక్ష్యానికీ తావులేదన్నారు. అధికారులు క్షేత్రస్థాయిలోనే సమస్యలను పరిశీలించి వెంటనే పరిష్కరించాలని ఆదేశించారు. పైపులైన్లలో లీకేజీలు లేదా నీటి కలుషితానికి అవకాశం ఉన్న చోట్ల తక్షణమే మరమ్మతులు చేపట్టాలని సూచించారు.
అదేవిధంగా తాగునీటి వృథాను అరికట్టేందుకు చర్యలు తీసుకోవడంతో పాటు ప్రజల్లో నీటి సంరక్షణపై విస్తృత అవగాహన కల్పించాలని పేర్కొన్నారు. తాగునీటి సరఫరా విభాగ సిబ్బంది, అమినిటీస్ కార్యదర్శులు ప్రతిరోజూ నీటి నాణ్యతను పరీక్షిస్తూ ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చూడాలని ఆదేశించారు.
ప్రతి అధికారి బాధ్యతాయుతంగా వ్యవహరించి ప్రజల నుంచి వచ్చే ఫిర్యాదులను తక్షణమే పరిష్కరించి మెరుగైన సేవలు అందించాలని కమిషనర్ చల్లా ఓబులేసు సూచించారు.
ఈ తనిఖీల్లో ఎంఈ గిరిరాజ్, డీఈఈ పవన్ కుమార్, ఏఈలు జనార్ధన్, రాంమోహన్, శానిటరీ సూపర్వైజర్ రమేష్, శానిటరీ ఇన్స్పెక్టర్లు హుస్సేన్, జిలానీ బాషా, మునిస్వామి తదితరులు పాల్గొన్నారు.
0 Comments