కడప, జూలై 26 (మహి న్యూస్): చేనేత కార్మికుల సంక్షేమం, హక్కుల సాధన కోసం జీవితాంతం కృషి చేసిన చేనేత పితామహుడు, స్వాతంత్ర్య సమరయోధుడు ప్రగడ కోటయ్య సేవలు చిరస్మరణీయమని జిల్లా పరిశ్రమల శాఖ జనరల్ మేనేజర్ చాంద్ బాషా పేర్కొన్నారు.
కడప కలెక్టరేట్లోని పి.జి.ఆర్.ఎస్. హాల్లో ఆదివారం ప్రగడ కోటయ్య 111వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా చాంద్ బాషా, జిల్లా చేనేత మరియు జౌళి శాఖాధికారి అహ్మద్ మొహిద్దిన్తో పాటు పలువురు అధికారులు, చేనేత సంఘాల నాయకులు ప్రగడ కోటయ్య చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
ఈ సందర్భంగా చాంద్ బాషా మాట్లాడుతూ, 1915 జూలై 26న జన్మించిన ప్రగడ కోటయ్య చేనేత కార్మికుల హక్కుల కోసం నిరంతరం పోరాడారని తెలిపారు. ఉమ్మడి మద్రాసు రాష్ట్ర శాసనసభ్యుడిగా, ఆంధ్రప్రదేశ్ శాసనమండలి సభ్యుడిగా, రాజ్యసభ సభ్యుడిగా ప్రజాసేవలో విశేష కృషి చేశారని గుర్తు చేశారు. చేనేత రంగానికి ప్రత్యేక బడ్జెట్, మగ్గాలకు ఉచిత విద్యుత్, సబ్సిడీలు, సహకార రంగ బలోపేతం, ఆప్కో స్థాపనలో ఆయన కీలక పాత్ర పోషించారని చెప్పారు. పేదలకు భూముల పంపిణీతో పాటు విద్యా రంగంలోనూ విశేష సేవలు అందించారని కొనియాడారు.
జిల్లా చేనేత మరియు జౌళి శాఖాధికారి అహ్మద్ మొహిద్దిన్ మాట్లాడుతూ, ప్రగడ కోటయ్య సేవలకు గుర్తింపుగా రాష్ట్ర ప్రభుత్వం ఆయన జయంతిని రాష్ట్ర పండుగగా నిర్వహిస్తోందన్నారు. చేనేత కార్మికుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేందుకు కృషి చేస్తామని తెలిపారు.
స్టెప్ మేనేజర్ సుబ్బరాయుడు, జాతీయ చేనేత ఐక్య వేదిక ప్రధాన కార్యదర్శి అవ్వారు మల్లికార్జున, పద్మశాలి సంగం రాష్ట్ర అధ్యక్షుడు మాసా కోదండరాం, తొగట వీర క్షత్రియ సంక్షేమ సంఘం జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ జొల్లు కొండయ్య, సీనియర్ జర్నలిస్టులు చౌడం సూరిబాబు, టేకూరి సుదర్శన్ తదితరులు మాట్లాడుతూ ప్రగడ కోటయ్య ఆశయాలు నేటి తరానికి స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు.
ఈ సందర్భంగా చేనేత కార్మికుల సంక్షేమానికి విశేష సేవలందిస్తున్న పలువురిని సన్మానించారు. కార్యక్రమంలో చేనేత మరియు జౌళి శాఖ అధికారులు, వివిధ చేనేత సహకార సంఘాల ప్రతినిధులు, చేనేత కార్మికులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
0 Comments