కర్నూలు, జూలై 26: బలిజ, కాపు సామాజిక వర్గాల న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని రాయల అఫిషియల్స్ అండ్ ప్రొఫెషనల్స్ అసోసియేషన్ (ROPA) డిమాండ్ చేసింది. ఆదివారం కర్నూలు నగరంలోని సాయి వసంత్ కాంప్లెక్స్లోని రోపా కార్యాలయంలో నిర్వహించిన కార్యవర్గ సమావేశంలో ఈ మేరకు తీర్మానించారు.
సమావేశానికి ముందు మాజీ మంత్రి కీర్తిశేషులు ముద్రగడ పద్మనాభంకు రోపా సభ్యులు నివాళులర్పించారు. అనంతరం టీజీవీ కళాక్షేత్రం అధ్యక్షులు కళారత్న పత్తి ఓబులయ్య మాట్లాడుతూ కాపు–బలిజ వర్గాలకు రిజర్వేషన్ల కోసం ముద్రగడ పద్మనాభం చేసిన ఉద్యమం చిరస్మరణీయమని పేర్కొన్నారు.
రోపా అధ్యక్షులు చింతలపల్లి రామకృష్ణ మాట్లాడుతూ, గతంలో కాపు కార్పొరేషన్ ద్వారా వేలాది మందికి రుణాలు, విదేశీ విద్యా దీవెన వంటి పథకాల ప్రయోజనాలు అందాయని గుర్తు చేశారు. కాపు–బలిజ వర్గాలకు 5 శాతం రిజర్వేషన్ల అంశంపై అసెంబ్లీలో ఆమోదించిన బిల్లుకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం పొందేలా చర్యలు తీసుకుని సామాజిక వర్గానికి న్యాయం చేయాలని కోరారు.
రోపా ప్రధాన కార్యదర్శి కోనేటి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ, రాయలసీమ జిల్లాల్లో బలిజ సామాజిక వర్గానికి నామినేటెడ్ పదవులు, చిన్న కాంట్రాక్టు పనుల్లో తగిన ప్రాధాన్యం లభించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో జనాభా ప్రాతిపదికన బలిజలకు తగిన ప్రాతినిధ్యం కల్పించాలని డిమాండ్ చేశారు.
రోపా కోశాధికారి అంచ పెద్దస్వామి మాట్లాడుతూ, గత 18 ఏళ్లుగా పేద మెరిట్ బలిజ విద్యార్థులకు స్కాలర్షిప్లు అందిస్తున్నట్లు తెలిపారు. ఈ విద్యా సంవత్సరానికి సంబంధించిన రెన్యూవల్ దరఖాస్తులను ఆగస్టు 15లోగా, కొత్త దరఖాస్తులను ఆగస్టు 30లోగా పూర్తి చేసి రోపా ప్రతినిధులకు అందజేయాలని సూచించారు.
ఈ సమావేశంలో మలిశెట్టి దివాకర్ రావు, కామిని వెంకటేశ్వర్లు, వడ్ల శ్రీకాంత్, గౌతమ్ కృష్ణ, లక్ష్మీనారాయణ, వీరేష్, మురళీమోహన్, తోట జనార్ధన్, ఆదిశేషయ్య, మధు, చంద్రమౌళి తదితరులు పాల్గొన్నారు.
0 Comments