, జూలై 15 (మహీన్యూస్):
డా. బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ప్రత్యేక సమగ్ర ఓటరు జాబితా సవరణ (ఎస్ఐఆర్) ప్రక్రియ 99 శాతం పూర్తయిందని జిల్లా కలెక్టర్ డా. ఆర్. మహేష్ కుమార్ తెలిపారు. జిల్లాలోని ఐదు అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఎస్ఐఆర్ ప్రక్రియను 100 శాతం పూర్తి చేయగా, ఆత్రేయపురం నియోజకవర్గంలో 219 మంది ఓటర్ల వివరాల నమోదు మాత్రమే మిగిలి ఉందన్నారు.
జిల్లాలోని అర్హులైన ప్రతి ఓటరికి ఓటు హక్కు పరిరక్షణ కల్పించడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని కలెక్టర్ పేర్కొన్నారు. బూత్ స్థాయి అధికారులు (బీఎల్వోలు) ఇంటింటికీ వెళ్లి అందజేసిన ఎస్ఐఆర్ ఫారాలను ఇంకా సమర్పించని ఓటర్లు వెంటనే పూర్తి చేసి అందించాలని సూచించారు.
ఓటరు జాబితాలో పేర్లు, చిరునామా, ఇతర వివరాలు సక్రమంగా నమోదు కావాలంటే ప్రతి ఓటరు ఈ ప్రక్రియలో భాగస్వామి కావాలని ఆయన కోరారు. ఎలాంటి అపోహలకు తావివ్వకుండా అవసరమైన వివరాలను బీఎల్వోలకు అందించాలని విజ్ఞప్తి చేశారు.
ప్రజల సౌకర్యార్థం ఎస్ఐఆర్ ప్రక్రియకు ప్రభుత్వం మరో 10 రోజుల గడువు పొడిగించినట్లు కలెక్టర్ వెల్లడించారు. ఈ అవకాశాన్ని వినియోగించుకుని ఇంకా ఫారాలు సమర్పించని వారు ఆలస్యం చేయకుండా తమ వివరాలను నమోదు చేసుకోవాలని సూచించారు.
జిల్లా యంత్రాంగం, ఎన్నికల అధికారులు, బీఎల్వోలు సమన్వయంతో ఎస్ఐఆర్ ప్రక్రియను విజయవంతంగా పూర్తి చేసే దిశగా చర్యలు చేపట్టారని, ప్రతి అర్హుడి ఓటు హక్కు రక్షణకు పూర్తి స్థాయిలో కట్టుబడి ఉన్నామని జిల్లా కలెక్టర్ డా. ఆర్. మహేష్ కుమార్ స్పష్టం చేశారు.
0 Comments