పెండింగ్లో ఉన్న రూ.7,000 కోట్ల ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్షిప్లు వెంటనే విడుదల చేయాలి..!
భారత ఐక్య విద్యార్థి ఫెడరేషన్ జిల్లా ప్రథమ మహాసభలో రాష్ట్ర ఉపాధ్యక్షుడు బోరెడ్డి నరసింహారెడ్డి డిమాండ్
నంద్యాల, మహి న్యూస్, సెప్టెంబరు 1: రాష్ట్రంలో విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించడంలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని భారత ఐక్య విద్యార్థి ఫెడరేషన్ (యూఎస్ఎఫ్ఐ) రాష్ట్ర ఉపాధ్యక్షుడు బోరెడ్డి నరసింహారెడ్డి విమర్శించారు. విద్యార్థుల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ నంద్యాల పట్టణంలోని సునీత వొకేషనల్ జూనియర్ కళాశాలలో యూఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో జిల్లా ప్రథమ మహాసభలు నిర్వహించారు.
ఈ సందర్భంగా రాష్ట్ర ఉపాధ్యక్షుడు బోరెడ్డి నరసింహారెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి మల్లికార్జున మాట్లాడుతూ.. విద్యార్థుల ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్షిప్లను సంవత్సరాల తరబడి పెండింగ్లో ఉంచడం వల్ల పేద, మధ్యతరగతి విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. పెండింగ్లో ఉన్న సుమారు రూ.7,000 కోట్లను తక్షణమే విడుదల చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
విద్యార్థుల హక్కులను కాలరాస్తున్న హాస్టల్ ఆంక్షలు..!
రాష్ట్రవ్యాప్తంగా 54 బీసీ వసతి గృహాలను పూర్తిగా మూసివేయాలనే నిర్ణయాన్ని ప్రభుత్వం వెంటనే వెనక్కి తీసుకోవాలని కోరారు. రాష్ట్రవ్యాప్తంగా 10 బీసీ రెసిడెన్షియల్ సంస్థలను తీసుకువచ్చే క్రమంలో ఇన్ని హాస్టళ్లను మూసివేయడం ఏమిటని ప్రశ్నించారు. కళాశాల వసతి గృహాలకు సొంత భవనాలు లేకుండా అద్దె భవనాల్లోనే నిర్వహిస్తున్నారని, తక్షణమే కళాశాల హాస్టళ్లకు సొంత భవనాలు నిర్మించాలని డిమాండ్ చేశారు.
సాంఘిక సంక్షేమ హాస్టళ్లలోకి విద్యార్థి సంఘాలు, ప్రజా సంఘాలు, పాత్రికేయులు వెళ్లకుండా ఆంక్షలు విధించడం ప్రజాస్వామ్య హక్కులను అణచివేయడమేనని విమర్శించారు. హాస్టళ్లలో విద్యార్థుల సమస్యలను తెలుసుకునే హక్కును ఎవ్వరూ హరించలేరని, ప్రభుత్వం ఈ నిషేధాలను వెంటనే ఎత్తివేయాలని డిమాండ్ చేశారు.
ప్రభుత్వ ఉత్తర్వు నంబర్ 77పై విద్యార్థుల్లో తీవ్ర ఆగ్రహం..!
ప్రభుత్వ ఉత్తర్వు నంబర్ 77ను తక్షణమే రద్దు చేసి పీజీ విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్ను పునరుద్ధరించాలని కోరారు. పేద విద్యార్థులు ఉన్నత విద్యను అభ్యసించకుండా అడ్డుకునే విధానాలను ప్రభుత్వం విడనాడాలని అన్నారు.
హాస్టల్ విద్యార్థుల మెస్ చార్జీలు పెంచాలి..!
నిత్యావసర వస్తువుల ధరలు భారీగా పెరిగినప్పటికీ విద్యార్థుల మెస్, సౌందర్య సాధనాల చార్జీలను తగిన స్థాయిలో పెంచకపోవడం అన్యాయమని అన్నారు. అన్నా క్యాంటీన్లలో భోజన ధరను రూ.83కు పెంచారని, జైళ్లలో ఖైదీలకు పౌష్టికాహారం అందించేందుకు మెస్ చార్జీలు పెంచుతున్న ప్రభుత్వం.. సాంఘిక సంక్షేమ హాస్టళ్లలో చదువుతున్న విద్యార్థుల మెస్ చార్జీలు ఎందుకు పెంచడం లేదని ప్రశ్నించారు.
ప్రైవేట్ విద్యా దోపిడీకి అడ్డుకట్ట వేయాలి..!
కార్పొరేట్, ప్రైవేట్ విద్యాసంస్థలు ఇష్టారాజ్యంగా ఫీజులు వసూలు చేస్తూ విద్యను వ్యాపారంగా మార్చుతున్నాయని విమర్శించారు. ప్రభుత్వ ఉత్తర్వుల నంబర్ 1ను అమలు చేసి, ప్రైవేట్ విద్యాసంస్థల్లో ఫీజు నియంత్రణను కఠినంగా అమలు చేయాలని డిమాండ్ చేశారు.
డీమ్డ్ విశ్వవిద్యాలయాల్లో ప్రవేశాలు పారదర్శకంగా ఉండాలి..!
ప్రైవేట్ డీమ్డ్ విశ్వవిద్యాలయాలు ప్రత్యేక ప్రవేశ పరీక్షల పేరుతో విద్యార్థులపై అదనపు ఆర్థిక భారాన్ని మోపడం సరికాదన్నారు. జేఈఈ మెయిన్స్, ఈఏపీసెట్ ర్యాంకుల ఆధారంగా ప్రవేశాలు కల్పించాలని, విశ్వవిద్యాలయాలు ప్రత్యేక ప్రవేశ పరీక్షలు నిర్వహించకుండా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
జాతీయ పరీక్షల సంస్థను రద్దు చేయాలి..!
నీట్, ఇతర జాతీయ స్థాయి పరీక్షల నిర్వహణలో జాతీయ పరీక్షల సంస్థపై విద్యార్థుల్లో నమ్మకం కోల్పోయిందని అన్నారు. జాతీయ పరీక్షల సంస్థను రద్దు చేసి, నీట్ తదితర జాతీయ స్థాయి పరీక్షల నిర్వహణ బాధ్యతలను రాష్ట్రాలకు అప్పగించాలని డిమాండ్ చేశారు.
జాతీయ పరీక్షల సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన యూజీసీ నెట్ పరీక్షల్లో ప్రశ్నపత్రం లీక్ కావడంతో ఇంగ్లీష్, కామర్స్, సోషియాలజీ పరీక్షలను మరోసారి నిర్వహించాల్సి రావడంతో అనేక మంది విద్యార్థులు నష్టపోయారని తెలిపారు. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ నిర్లక్ష్యానికి ఇది నిదర్శనమని, కేంద్ర ప్రభుత్వం జాతీయ పరీక్షల సంస్థను రద్దు చేయాలని డిమాండ్ చేశారు.
ఖాళీ అధ్యాపక పోస్టులను భర్తీ చేయాలి..!
రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాల్లో ఖాళీగా ఉన్న అధ్యాపక పోస్టులను భర్తీ చేయకుండా ఉన్నత విద్యా ప్రమాణాలను ఎలా పెంచుతారని ప్రశ్నించారు. ఖాళీ పోస్టులను తక్షణమే భర్తీ చేసి విద్యార్థులకు నాణ్యమైన ఉన్నత విద్య అందించాలని కోరారు.
సమస్యలు పరిష్కరించకపోతే ఉద్యమం ఉధృతం..!
విద్యార్థుల సమస్యలను పరిష్కరించకుండా ప్రభుత్వం కాలయాపన చేస్తే విద్యార్థి లోకం చూస్తూ ఊరుకోదని యూఎస్ఎఫ్ఐ నాయకులు హెచ్చరించారు. విద్యార్థుల హక్కుల కోసం దశలవారీగా ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. విద్యార్థుల సమస్యలను పరిష్కరించకపోతే ప్రభుత్వం తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని స్పష్టం చేశారు.
ఈ కార్యక్రమంలో యూఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు జయసింహారెడ్డి, జిల్లా కార్యదర్శి సురేంద్రనాయక్, ఆళ్లగడ్డ నియోజకవర్గ అధ్యక్షుడు సంతోష్, బనగానపల్లె అధ్యక్షుడు శివ, విద్యార్థి నాయకులు కార్తీక్, దినేష్, యువరాజ్, మద్దిలేటి, శీను తదితరులు పాల్గొన్నారు.
0 Comments