కడప, మహి న్యూస్ సెప్టెంబర్ 12: వినాయక చవితి ఉత్సవాలను ప్రజలు భక్తిశ్రద్ధలతో, ప్రశాంత వాతావరణంలో, పర్యావరణహితంగా నిర్వహించేలా అన్ని శాఖలు సమన్వయంతో అవసరమైన ఏర్పాట్లు చేపట్టాలని కడప రెవెన్యూ డివిజనల్ అధికారి మురళి సూచించారు.
శనివారం కడప ఆర్డీవో కార్యక్రమంలో వినాయక చవితి ఉత్సవాల నిర్వహణకు సంబంధించి రెవెన్యూ డివిజన్ స్థాయి సమన్వయ కమిటీ సమావేశం ఆర్డీవో మురళి అధ్యక్షతన జరిగింది.
ఈ సందర్భంగా ఉత్సవాల నిర్వహణ, వినాయక విగ్రహాల ఏర్పాటు, నిమజ్జన కార్యక్రమాలపై సంబంధిత శాఖల అధికారులతో ఆర్డీఓ సమీక్షించారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ముందస్తు ప్రణాళికతో అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని సూచించారు.
వినాయక విగ్రహాల తయారీలో మట్టి విగ్రహాలకు ప్రాధాన్యత ఇవ్వాలని, పర్యావరణానికి హాని కలిగించే పదార్థాల వినియోగాన్ని నివారించాలని సూచించారు. మండపాల ఏర్పాటు, విద్యుత్ సరఫరా, భద్రత, పారిశుధ్యం తదితర అంశాల్లో సంబంధిత నిబంధనలు తప్పనిసరిగా పాటించేలా చూడాలన్నారు.
ఉత్సవాల సందర్భంగా అధిక శబ్దం, బాణసంచా వినియోగాన్ని నియంత్రిస్తూ నిర్ణీత నిబంధనలు, సమయాలను పాటించాలని సూచించారు. మండపాల వద్ద విద్యుత్ ప్రమాదాలు జరగకుండా విద్యుత్ శాఖ అధికారులు ముందస్తు తనిఖీలు నిర్వహించాలని తెలిపారు.
వినాయక విగ్రహాల నిమజ్జనం సందర్భంగా ఊరేగింపుల మార్గాల్లో ట్రాఫిక్కు అంతరాయం కలగకుండా చర్యలు చేపట్టాలని, నిమజ్జన ప్రాంతాల్లో బారికేడ్లు, తగినంత వెలుతురు, భద్రతా చర్యలు, పారిశుధ్య ఏర్పాట్లు కల్పించాలని ఆర్డీఓ సూచించారు. అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనేందుకు వైద్య, అగ్నిమాపక సిబ్బంది అందుబాటులో ఉండేలా చూడాలన్నారు.
నిమజ్జనం అనంతరం పరిసర ప్రాంతాల్లో పరిశుభ్రతను కాపాడేందుకు పారిశుధ్య సిబ్బందితో ప్రత్యేక చర్యలు చేపట్టాలని, పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. ఉత్సవాల నిర్వహణలో ఎలాంటి సమస్యలు తలెత్తకుండా అన్ని శాఖల అధికారులు పరస్పర సమన్వయంతో పనిచేయాలని ఆర్డీఓ ఆదేశించారు.
ఈ సమావేశంలో మునిసిపల్, పోలీసు, విద్యుత్, అగ్నిమాపక, వైద్య, పర్యావరణ, ఇంజినీరింగ్ తదితర శాఖల అధికారులు పాల్గొన్నారు.
0 Comments